అల్లాహ్ తో హజ్రత్ నూహ్[అ.స] విన్నపం మరియు ప్రార్థన తరువాత తుఫాను ఎలా మొదలయ్యింది అన్న విషయంపై ఖుర్ఆన్ వివరణ.
హజ్రత్ నూహ్[అ.స] ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత తుఫాను వచ్చే లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. ఒక నిప్పుతో ఉన్న పొయ్యి నుండి నీళ్ళు పొంగాయి. ఈ సంఘటనను అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మా ఆదేశం వచ్చి, పొయ్యి పొంగినప్పుడు, ఈ ఓడలోకి ప్రతి(జీవ) రాసి నుంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు) చొప్పున ఎక్కించుకో. నీ ఇంటివారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనయితే ముందుగానే మాట ఖరారయిందో వారిని విదలేయి. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము అతనికి చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించినవారు బహు కొద్దిమంది మాత్రమే.[హూద్:40]
అప్పుడు హజ్రత్ నూహ్(అ.స) వారితో ఇలా అన్నారు: “మీరు ఈ ఓడలో కూర్చోండి – అల్లాహ పేరుతోనే – దీని గమనం, దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు” [హూద్:41].
అల్లాహ్ ఆ తుఫాను ఆరంభం గురించి ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “అప్పుడు మేము ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరచి వేశాము. మరి భూమి నుండి కూడా నీటి ఊటలు పొంగిపొరలేలా చేశారు. నిర్ణయించబడిన పనిని పూర్తిచేయటానికి (రెండు) నీళ్ళు కలిశాయి. మరి మేమతన్ని పలకలు, మేకులు గల దానిలో ఎక్కించాము(అనగా ఓడ) అది మా కనుల ముందరే పయనించసాగింది.[ఖమర్:10-14]. ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది.[హూద్:42].
వ్యాఖ్యానించండి