“బర్జఖ్” ఇహలోక జీవితానికీ పరలోక జీవితానికి మధ్య “విరామంగా” ఉంటుంది. మరణించిన క్షణం నుంచి ప్రపంచంతో మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మొదలవదు...
ఆయతుల మరియు హదీసులనుసారం మృత్యువు, ఈలోకం యొక్క చివరి స్థానం మరియు పరలోకం యొక్క మొదటి స్థానం. మరణించిన తరువాత కొన్ని స్థానాలు ఉంటాయి వాటిని ఒకటి తరువాత మరొకటిగా దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వాటి క్రమం: మృత్యువు, సమాధి మరియు బర్జఖ్, ఖియామత్, లెక్క తీసుకోవడం, సిరాత్, స్వర్గ-నరకం-అఅరాఫ్. ఈ స్థానాలు అందరికీ వర్తిస్తాయి. మనిషి ఈలోకంలో చేసిన చర్యలను బట్టి పరలోకం స్థితి నిర్ణయించబడుతుంది. ఇవన్నీ కేవలం ఖుర్ఆన్ మరియు రివాయతుల ఆధారంగానే నిదర్శించబడతాయి. ఇక్కడ బర్జఖ్ మరియు ఖియామత్ గురించి తెలుసుకుందా:
బర్జఖ్
రెండు వస్తువులకు మధ్యనున్న అడ్డును లేక తెరను “బర్జఖ్” అని అంటారు. ఇది ఇహలోక జీవితానికీ పరలోక జీవితానికి మధ్య “విరామంగా” ఉంటుంది. మరణించిన క్షణం నుంచీ ప్రపంచంతో మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మొదలవదు. మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ “మరో లోకం” మొదలవుతుంది. ఈ రెండు లోకాలకు మధ్యనున్న “అవస్థ”ను “బర్జఖ్” అవస్థ అంటారు. మృతుడు సమాధిలో ఉన్నా, కాకులకు గద్దలకు ఆహారంగా మారినా, కాల్చివేయబడి మట్టిలో కలసిపోయినా, మరేమైనా – అది బర్జఖ్ అవస్థగానే పరిగణించబడుతుంది. తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఇచ్చి – అందరినీ “మహ్షర్” మైదానంలో సమావేశపరుస్తాడు.
ఒక్కోసారి బర్జఖ్ ను “ఖియామతె సుగ్రా” చిన్నపాటి ఖియామత్ అనీ మరియు మహ్షర్ ను “ఖియామతె కుబ్రా” పెద్దపాటి ఖియామత్ అనీ అంటారు.
బర్జఖ్ గురించి ఖుర్ఆన్లో ఇలా సూచించబడి ఉంది:
“చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు, ‘ఓ ప్రభూ! నన్ను తిరిగి వెనక్కి పంపించు. నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను’ అని అంటాడు. ముమ్మాటికీ అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్లీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనక ఒక అడ్డుతెర ఉంటుంది”[సూరయె మోమినూన్, ఆయత్:99,100]
ఈ ఆయత్ ద్వార తెలిసే విషయమేమిటంటే మనిషికి మరణించిన తరువాత మరియు ప్రళయదినానికి ముందు ఒక ప్రత్యేక జీవితం ఉంది. అది ఎలా ఉంటుంది అన్నది అతడు ఈ లోకంలో చేసిన మంచి మరియు చెడుకు మరియు అలాగే అతడి విశ్వాసాలను బట్టి ఉంటుంది.
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “బర్జఖ్ ఒక సమాధి ప్రపంచం, అంటే ఇహపరలోకల మధ్య పుణ్యం మరియు శిక్ష”[1]
ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “మా ప్రభూ! నీవు రెండుసార్లు మాకు చావునిచ్చావు. రెండు సార్లు బ్రతికించావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. మరి ఇప్పుడు బయటపడే మార్గం ఏదన్నా ఉందా?” అని విన్నవించుకుంటారు.[సూరయె గాఫిర్, ఆయత్11]
ఈ ఆయత్ ఈ లోక మరణం మరియు బర్జఖ్ లో బ్రతికించబడడం ఆ తరువాత బర్జఖ్ లో మరణం మరియు ఖియామత్ లో బ్రతికించడాన్ని సూచిస్తుంది.[2]
ఖియామత్
ఖియామత్ మనిషి మృత్యువుతో మొదలవుతుంది. మరణించిన తరువాత బర్జఖ్ లో ప్రవేశిస్తాడు అక్కడ జీవితాన్ని శంఖం ఊదినప్పుడు ప్రజలు సమాధుల నుంచి బయటకు వచ్చేంత వరకు గడుపుతాడు. అప్పుడు ఖియామత్ లో ప్రవేశిస్తాడు. బర్జఖ్ మరియు ఖియామత్ మధ్య తేడా ఏమిటంటే బర్జఖ్ ఒక్కొక్కరికి సంబంధించింది, చావుతో మొదలవుతుంది, కాని ఖియామత్ ఒకరికి సంబంధించినది కాదు అది సమస్త ప్రజలకు సంబంధించింది. ఖియామత్ ఇస్రాఫీల్ యొక్క రెండు సార్లు శంఖం ఊదడంతో మొదలవుతుంది. మొదటి సారి ఊదినప్పుడు జీవులందరూ మరణిస్తారు రెండవ సారి ఊదినప్పుడు మరణించినవారందరూ బ్రతుకుతారు. ఖుర్ఆన్ ఇలా సూచించెను:
“మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు – కాని అల్లాహ్ కోరిన వార మాత్రం (స్పృహ కోల్పోరు)! మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు”[సూరయె జుమర్, ఆయత్68]
రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం6, పేజీ218.
2. అల్ మీజాన్, సయ్యద్ మొహమ్మద్ హుసైన్ తబాతబాయి, భాగం17, పేజీ475.
వ్యాఖ్యానించండి