పరలోకంలో మనిషి ఈ స్థానాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఖియామత్ పేర్లలో ఒకటి “యౌముల్ హిసాబ్” అనగా “లెక్క రోజు”...
మరణించిన తరువాత కొన్ని స్థానాలు ఉంటాయి వాటి క్రమం ఇలా ఉంటుంది: మృత్యువు, సమాధి మరియు బర్జఖ్, ఖియామత్, యౌముల్ హిసాబ్, సిరాత్, స్వర్గ-నరకం-అఅరాఫ్. ఈ స్థానాలు అందరికీ వర్తిస్తాయి. మనిషి ఈలోకంలో చేసిన చర్యలను బట్టి పరలోకం స్థితి నిర్ణయించబడుతుంది. ఇవన్నీ కేవలం ఖుర్ఆన్ మరియు రివాయతుల ఆధారంగానే నిదర్శించబడతాయి. ఇక్కడ యౌముల్ హిసాబ్ గురించి తెలుసుకుందా:
లెక్క తీసుకోవడం
పరలోకంలో మనిషి ఈ స్థానాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఖియామత్ పేర్లలో ఒకటి “యౌముల్ హిసాబ్” అనగా “లెక్క రోజు”.
ఖుర్ఆన్ ఇలా సూచించెను: “మీరు చేస్తున్న పనులన్నింటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు”[సూరయె నహ్ల్, ఆయత్93]
మరో చోట ఇలా ఉంది: “మరి ఆ రోజు (దేవుని) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది”[సూరయె తకాసుర్, ఆయత్08]
లెక్క సమయంలో నాలుగు ప్రధాన అంశాలు
అల్లాహ్ న్యాయస్థానంలో నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయి: చర్య పత్రం, మీజాన్, సాక్ష్యులు మరియు చర్యల స్వరూపం.
అ) చర్య పత్రం[1]
ఆయతులు మరియు రివాయతులనుసారం మనిషి చేసే చర్యలన్నీ అవి మంచివి కానివ్వండి చెడు కానివ్వండి నమోదు చేయబడతాయి మరియు లిఖించబడతాయి అని ఉంది. లిఖించబడతాయి అనగా మనిషి చర్యలు ఏదో ఒక పుస్తకంలో లిఖించబడతాయి అని కాదు. ఆత్మలో ఉంటాయి అవి అక్కడ వ్యక్తమౌతాయి.[2] కొంత మంది వ్యాఖ్యాతలు ఇలా వివరించారు: ఈ చర్య పత్రం మనిషి ఆత్మ తప్ప వేరే ఏదీ కాదు. చర్యలన్నీ అందులో నమోదు చేయబడతాయి, ఎందుకంటే మేమ చేసే ప్రతీ పని యొక్క ప్రభావం మన ఆత్మ పై పడుతుంది.[3]
ఆ) మీజాన్
మీజాన్ అనగా తూచే పరికరం. మనిషి విశ్వాసాలను, సద్గుణాలను మరియు ప్రవర్తనలను తూచే త్రాసులు ఉన్నాయి అన్న విషయం ఆయతులు మరియు రివాయతుల ద్వార తెలుస్తుంది.
ఖుర్ఆన్ ఇలా ఉల్లేఖిస్తుంది: “మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు”[సూరయె అంబియా, ఆయత్47.]
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఈ ఆయత్ ను ఇలా వ్యాఖ్యానించారు: ప్రళయదినాన న్యాయ త్రాసులు ఇవి: “ప్రవక్తలు మరియు ఔసియాలు”[4] ఈ విధంగా మనిషి విశ్వాసాలను, సద్గుణాలను మరియు ప్రవర్తనలను ప్రవక్తల మరియు ఔసియాల విశ్వాసాలను, సద్గుణాలను మరియు ప్రవర్తనలతో పోల్చడం జరుగుతుంది.[5]
ఇ) సాక్ష్యులు
దైవ న్యాయస్థానం ఇతర న్యాయస్థానల వలే సాక్ష్యులు కలిగి ఉంటుంది. ఆ సాక్ష్యాలు మనిషి యొక్క చర్యలను నిదర్శిస్తాయి. ఖుర్ఆన్ ఖియామత్ ను “సాక్ష్యాలిచ్చే వారు నిలబడే రోజు”[సూరయె గాఫిర్, ఆయత్51] అని సూచిస్తుంది. ప్రళయదినం యొక్క సాక్ష్యులు రెండు రకాలు బయట సాక్ష్యాలు మరియు లోపలి సాక్ష్యాలు: బయట సాక్ష్యాలు అనగా: అల్లాహ్[సూరయె యూనుస్, ఆయత్61], దైవప్రవక్తలు[సూరయె నహ్ల్, ఆయత్89], పవిత్ర మాసూములు[సూరయె తౌబహ్, ఆయత్105] మరియు దైవదూతలు. లోపలి సాక్ష్యాలు అనగా: మనిషి శరీర భాగాలు[సూరయె ఫుస్సిలత్, ఆయత్20]
ఈ) చర్య స్వరూపం
ప్రళయదినాన ప్రాముఖ్యతలలో ఒకటి మన పనులు రూపాన్ని దాల్చుకొని మనకు కనిపిస్తాయి. ఖుర్ఆన్ దీని గురించి ఇలా ఉపదేశించెను: “ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం”[సూరయె బఖరహ్, ఆయత్167.]
మరో చోట ఇలా ఉంది: “ఆ రోజు ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్30]
సూరయె జిల్ జాల్ లో ఇలా ఉపదేశించడి ఉంది:
“కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణు మాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు”[సూరయె జిల్ జాల్, ఆయత్7-8]
రిఫరెన్స్
1. నామయె ఆమాల్.
2. దఫ్తర్ చే పంజుమ్, ఖద్ర్ దాన్ ఫరా మలికీ, పేజీ246.
3. తఫ్సీరె నమూనహ్, మకారిమ్ షీరాజీ, భాగం15, పేజీ55.
4. నూరుస్సఖ్లైన్, ఇబ్నె జుమా అల్ ఉరూసీ అల్ హువైజీ, భాగం3, పేజీ430, హదీస్77.
5. మఆద్ దర్ ఖుర్ఆన్, జవాదీ ఆములీ, పేజీ202.
వ్యాఖ్యానించండి