వివేకం గురించి ఇమాం కాజిం ల వారి ఉపదేశం.
ఇమాం కాజిం[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: "వివేకాన్ని మూర్ఖుల చేతికి ఇవ్వవద్దు.అలా చేస్తే మీరు వివేకం పట్ల అన్యాయం చేసినట్లే.మరియు దానిని దాని అర్హుల నుండి నిరాకరించవద్దు అలా చేస్తే మీరు వారిపై[వివేకులపై] దౌర్జన్యం చేసినట్లే”.
వివేకమనేది దృఢమైన మరియు ప్రయోజనకరమైన పదాల జ్ఞానం మరియు అనుభవం.వాటిని తెలుసుకోవటం ద్వారా జీవన విధానానికి మంచి మార్గ నిర్ధేశం చేయవచ్చు.భగవంతుడు వివేకి మరియు జ్ఞాని కాబట్టే అతని వచనాలు మరియు కార్యాలు కూడా వివేకంతో నిండి ఉంటాయి.దైవవాణి ఈ విధంగా సెలవిస్తుంది: ఆయన[అల్లాహ్] తాను కోరిన వారికి విజ్ఞతా వివేచనాలను ప్రసాదిస్తాడు.ఎవరికి విజ్ఞతా వివేచనాలు వొసగబడ్డాయో[ఇవ్వబడ్డాయో] అతనికి ఎన్నో మేళ్ళు వొసగబడినట్లే [అల్ బఖర/269]. అందుకే దైవప్రవక్తలు కూడా గ్రంధంతో పాటు వివేకాన్ని కూడా బోధించే వారు. “అతడు [దైవప్రవక్త] వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు,వారిని పరిశుధ్ధపరుస్తున్నాడు.వారికి గ్రంధాన్ని,వివేకాన్ని బోధిస్తున్నాడు” [అల్ జుము అహ్/2]. వివేకం లేని జ్ఞానం వలన ఎవరికి ఉపయోగం ఉండదు.కొందరికి జ్ఞానమైతే ఉంది కాని వివేకం లేదు అటువంటి వారు అజ్ఞానులతో సమానం. వారికి వివేకంతో నిండిన వచనాలను వినిపించటం ఒక చిన్న పిల్లవాని చేతికి అమూల్యమైన రత్నాన్ని ఇవ్వటం లాంటిది ఆ పిల్లవానికి దాని విలువ తెలియదు అతను దానిని ఒక ఆటవస్తువుగా భావించి దానిని [జాగ్రత్త పరుచుకోకుండా] ఏదో ఒక చోట పోగొట్టుకుంటాడు. అలాగే దానిని[వివేకాన్ని] దాని అర్హుల నుండి నిరాకరించ కూడదు అలా చేసినట్లైతే మనము వారిపై దౌర్జన్యం చేసినట్లవుతుంది.
రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,75వ భాగం,పేజీ నం: 303.
వ్యాఖ్యానించండి