అవసరమున్నవాడిని ఆదుకోవటం,నిరుపేదలకు సహయపడమని ఇస్లాము చెబుతుంది.ఒక వేళ అలా చేయని యెడల వారికి బాధాకరమైన శిక్ష తప్పదని కూడా అల్లాహ్ దివ్యఖురానులో హెచ్చరిస్తున్నాడు.
ఇస్లాములో జకాతు మరియు ఖుంస్ లాంటి తప్పనిసరిగా చేయబడ్డ విధులతో పాటు ధనికులపై మరియు శక్తివంతులపై కొన్ని హక్కులు కూడా విధిగా చేయబడ్డాయి.అలాంటి హక్కులలో ఇతరులను ఆదుకోగలిగే స్తోమత ఉన్న ధనికులను తమ అవసరాలను తీర్చుకున్న తరువాత ఆర్ధికపరంగా బలహీనులైన వారిని ఆదుకోమని ఇస్లాము ఆదేశిస్తుంది.దివ్యఖురానులో మరియు మాసూముల హదీసులలో దీనిపై తాకీదు కూడా చేయటం జరిగింది.దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు: స్థోమత ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టుగా ఖర్చు చేయాలి.మరెవరికైతే అతని ఉపాధి కుదించబడిందో,అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి[తన స్థాయికి తగ్గట్టుగా] ఖర్చు పెట్టాలి.అల్లాహ్ ఏ ప్రాణిపైనా దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు.అల్లాహ్ ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు [అత్ తలాఖ్/7]. వేరొక చోట ఈ విధంగా ఆజ్ఞాపించడం జరిగింది: బంధువుల,నిరుపేదల,ప్రయాణికుల హక్కును వారికి ఇస్తూ ఉండు.దుబారా ఖర్చు చేయకు [అల్ ఇస్రా/26]. దైవప్రవక్త[స.అ.వ] ల వారు కూడా ఈ విషయంపై ఎంతగా తాకీదు చేసారంటే ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరి వద్దైతే రెండు వస్త్రాలున్నాయో అతను ఒక వస్త్రాన్ని తాను కప్పుకోవటానికి వేరొక దానిని తన మతసోదరుడికి కప్పటానికి వినియోగించాలి [ముంతఖబె మీజానుల్ హిక్మహ్,రయ్ షెహ్రి,పేజీ నం:534].
వ్యాఖ్యానించండి