దైవప్రవక్త(అ.స)ల అవతరణ ఎందుకు అవసరం?, అలాగే వారు ఎందుకు పాపములు నుంచి పవిత్రులుగా ఉండాలి? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
నుబువ్వత్ ఇస్లాం యొక్క మూల విశ్వాసం. నుబువ్వత్ అనగా అల్లాహ్ ప్రవక్తల దౌత్యం పట్ల “వారు అల్లాహ్ తరపు నుంచి మానవాళి మార్గదర్శకం కోసం అవతరించబడ్డారు, వారి సంఖ్య కొన్ని రివాయతుల అనుసారం 124 వేలు, వారిలో అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్(స.అ) అని” విశ్వాసం కలిగివుండడం.
దైవప్రవక్త(అ.స)ల అవతరణ అవసరం
అల్లాహ్ వివేచనాశీలి అని అందరికి తెలిసిన విషయమే, ఇంత పెద్ద విశ్వాన్ని ఏ లక్ష్యం లేకుండా సృష్టించడు. అదే విధంగా సృష్టి యొక్క లక్ష్యం ఆయనకు ఏదో లాభం కలుగుతుంది అని కూడా కాదు అనే విషయం కూడా తెలిసిందే ఎందుకంటే ఇంతకు ముందు వివరించినట్లుగా అల్లాహ్ లోపాలకు అతీతుడు, అల్లాహ్కు ఏదీ అవసరం లేదు; బహుశా ఈ సృష్టి ద్వార ఆ లోపాలను తొలగించుకోవడానికి సృష్టించాడు అనడానికి.
కనుక సృష్టి యొక్క లక్ష్యం సృష్టితాల కోసమే అని అర్ధమౌతుంది. ఆ సృష్టి యొక్క లక్ష్యం “సంపూర్ణ స్థాయికి చేరడం” అయితే ఆ స్థాయికి ఎలా చేరగలం?, అన్న ప్రశ్న ప్రతిమనిషికి వస్తుంది.
అల్లాహ్ తరపు నుండి ప్రత్యేక ప్రణాళిక, బోధకుడు, శిక్షణ ఇచ్చేవాడు లేకుండా మనిషి పరిపూర్ణ స్థాయికి చేరడం అసాధ్యం అన్న విషయం చాలా స్పష్టమైనది. బోధకులు అల్లాహ్ తరపు నుంచి నిర్ధారించబడినవారు కాకుండా మన భూమికి చెందినవారు అయి వుంటే వారు యదార్థం పట్ల తమకు ఉన్న పరిమిత జ్ఞానం మరియు ఆలోచన వల్ల మానవుడ్ని సరైన మార్గాన్ని బోధించలేరు. అదే విధంగా వారు పవిత్రులు కానందువల్ల వారు తప్పులు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా అల్లాహ్ తరపు నుంచి ఎన్నుకో బడ్డ ప్రముఖులు తప్ప వేరేవారికి మానవుడి రుజుమార్గదర్శకం అర్హత లేదు.
కాని అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ బోధకులు మరియు నాయకులు అయితే వారి సంబంధం ప్రత్యేకంగా అల్లాహ్తో ఉండడం మరియు వారిని అల్లాహ్ పవిత్రులుగా నిశ్చయించడం ద్వార వారు తప్పులు చేయరు. వారే మానవుడ్ని సంపూర్ణ స్థితికి చేరే విధంగా మార్గం చూపగలరు.
పైవివరణ ద్వార తెలిసే విషయమేమిటంటే, మనిషి శిక్షణ ప్రణాళిక తప్పకుండా మానవుని గురించి పూర్తిగా తెలిసిన సృష్టికర్త తరుపు నుండి అయి ఉండాలి. ఆ సృష్టికర్తకు మాత్రమే తెలుసు ఈ మనిషికి ఏది లాభాన్ని చేకూరుస్తుంది మరియు ఏది నష్టనికి గురి చేస్తుంది అని. ఈ ప్రణాళిక అల్లాహ్ ద్వార ఎన్నుకోబడ్డ దైవప్రవక్తల ద్వార మానవుల కోసం బోధించబడాలి అప్పుడే మానవుడు సంపూర్ణ స్థాయికి చేరుకోగలడు. అప్పుడే మానవుడు తన సృష్టి లక్ష్యాన్ని పొందగలడు.
దైవప్రవక్తలు పవిత్రులు
దైవప్రవక్తలు మానవులకు రుజుమార్గం చూపించి వారిని పరిపూర్ణ స్థితికి చేర్చడానికి అవతరించబడ్డారు అని ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. అయితే ఆ మార్గం చూపించు వారు మాట్లాడే ప్రతీ మాట మరియు వేసే ప్రతీ అడుగు రుజుమార్గాన్నే సూచించాలి, ఒకవేళ అతడు తప్పులు చేసేవాడు, అపవిత్రుడు అయి ఉంటే మానవులను పవిత్రత మరియు పరిశుద్ధత గురించి బోధించలేడు. అంటే దైవప్రవక్తలు తప్పకుండా పవిత్రులు అయి ఉండాలి, వారిలో చిన్న తప్పు మరియు అపవిత్రత ఉండకూడదు.
మరో విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ప్రజలకు నిత్యం నిజమే చెప్పాలీ, న్యాయంగా ఉండాలి అని బోధిస్తున్నాడు కాని అతడే అబద్ధమాడుతున్నాడు, అతడే న్యాయంగా లేడు; అలాంటప్పుడు అతడి మాటలు ప్రజలపై ప్రభావం చూపవు. ఇదే విధంగా అల్లాహ్ తరపు నుంచి వచ్చిన ప్రవక్తలు కూడా తప్పులు చేసేవారు అయి వుంటే మానవులు వారి మాటలను అబద్ధం అని భావించే అవకాశం ఉంది, వారి మాటల పట్ల నమ్మకం కలగదు. నమ్మకం లేకపోవడంతో వారి మాటలను, ఆదేశాలను అనుసరించరు, దాంతో వారి అవతరణ లక్ష్యం వృధా అవుతుంది.
వీటిపై ఖుర్ఆన్ నిదర్శనం: అల్లాహ్ షైతాన్తో ఇలా అన్నాడు: “నా దాసుల పై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టుల పై మాత్రమే సాగుతుంది”[సూరయె హిజ్ర్, ఆయత్42]. ఇబ్లీస్ పలికాడు: “మరయితే నీ గౌరవమర్యాదల సాక్షిగా (చెబుతున్నాను) అందరినీ నేను పెడదారి పట్టిస్తాను. ఎంపిక కాబడిన కొంతమంది నీ దాసులను తప్ప! (ప్రవక్తలు మరియు ఇమామ్ లు)”[సూరయె సాద్, ఆయత్82]
ఖుర్ఆన్ లో దైవప్రవక్త(స.అ) గురించి ఇలా అనెను: “అల్లాహ్ దయవల్లనే నీవు వారి యొడలమృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు”[సూరయె నిసా, ఆయత్159]
ఇస్లాం యొక్క కొన్ని వర్గాల వారు దైవప్రవక్తలు పవిత్రులు మరియు మాసూములు అనగా ఏ తప్పూ చేయకుండా ఉండేవారు అని నమ్మరు. వారు దైవప్రవక్తలే కాని వారు కూడా ఇతర మానవుల వలే తప్పులు చేస్తారు అని నమ్ముతారు. కాని ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం వారి ఈ నమ్మకం సరైనది కాదు అని తెలుస్తుంది.
రిఫరెన్స్
1. కలామె ఇస్లామీ, సయీదీ మెహ్ర్, భాగం1, రాహ్నుమా షినాసీ అధ్యాయం, కితాబె తాహా.
వ్యాఖ్యానించండి