తెలిసి ఎదుటివారిని మోసగించాలని అనుకోవటం మహా పాపం, వారితో అల్లాహ్ ప్రతీకారం తీర్చుకుంటాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
మీసమె తమ్మార్, హజ్రత్ అలీ[అ.స] యొక్క ప్రముఖ సహాబీ. ఇతను కూఫాలో ఖర్జూర వ్యాపారం చేసేవారు. హజ్రత్ అలీ[అ.స]కు మీసమ్ యొక్క దుకాణం వద్దకు వచ్చి కూర్చోనె అలవాటు ఉండేది. అలా కూర్చోని ప్రజలకు వ్యాపారంలో ఉన్న లాభాలు చెబుతుండే వారు. ఒకరోజు మీసమ్ ఇమామ్ ను తన దుకాణం పై కూర్చోమని చెప్పి బయటకు వెళ్ళారు. కాసేపు తరువాత ఒక వ్యక్తి కర్జూరపళ్లు కొనుక్కోవడానికై వచ్చాడు, ఇమామ్ అతడికి పళ్లు తూకమేసి ఇచ్చారు అతడు చెల్లని నాణ్యాన్ని ఇమామ్ కు ఇచ్చి ఆనందపడుతూ వెళ్ళిపోయాడు.
మీసమ్ తిరిగి వచ్చినప్పుడు ఇమామ్ అతనికి ఆ నాణ్యాన్ని ఇచ్చారు. అతను “స్వామీ, ఈ నాణ్యం చెల్లని నాణ్యం కదా” అన్నారు. ఇమామ్ “పరవాలేదు, అలా అని నాకు తెలుసు, కాని నేను అతడిని అవమానానికి గురి చేయాలనుకోలేదు. అల్లాహ్ మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు” అని అన్నారు. కాసేపటికే ఆ వ్యక్తి తిరిగి వచ్చి “ఓ అలీ ఈ పళ్లలో పురుగులున్నాయి” అని అన్నాడు. అప్పుడు ఇమామ్ “నీ నాణ్యాం నువ్వు తీసుకో నా పళ్లు తిరిగి ఇచ్చేయి” అన్నారు. అతడు కర్జూర పళ్లు ఇచ్చేసి నాణ్యాం తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు. మీసమ్ ఆ కర్జూర పళ్లను చూశారు, అవి మంచిగానే ఉన్నాయి, అది చూసి మీసమ్ ఇలా అన్నారు: “స్వామీ, దీని అర్థమేమిటి?”
ఇమామ్ ఇలా అన్నారు: మీసమ్! అల్లాహ్ తన మంచి దాసులను ఇలాగే గుర్తుపెట్టుకుంటాడు. ఆ వ్యక్తి మనల్ని మోసం చేయాలనుకున్నాడు, అల్లాహ్ అతడితో ప్రతికారం తీర్చుకున్నాడు. అతడిని తన పన్నాగంలో విఫలం చేశాడు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి