కర్బలా ఎందుకు సంభవించింది. ప్రజల పై దాని ప్రభావం. ఈ కాలంలో కర్బలాను మరో సారి ప్రజలకు పరిచయం చేసిన చర్య అర్బయీన్ పాదయాత్ర. ఇది అతి కొద్ది సంవత్సరములలోనే విశ్వప్రసిద్ధత పొందింది.
![విశ్వప్రసిద్ధ పాదయాత్ర](https://te.btid.org/sites/default/files/field/image/139309181712372014255944.jpg)
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
మనసుని కలచివేసే కర్బలా సంఘటనకు 1400 సంవత్సరాలు గడిచినా దానినే ప్రతీ సంవత్సరం స్మరించడానికి గల ముఖ్యకారణం, యావత్ ప్రపంచానికి సత్య అసత్యాల మధ్య బేధాన్ని తెలియపరచడం. ఇస్లాం కోసం ప్రాణలను ఆనందంగా త్యాగం చేసేవారెవరో మరియు పైకి ఇస్లాం దూస్తులు ధరించి ఇస్లాం ఆజ్ఞలను వ్యతిరేకించువారు ఎవరో తెలియాలి.
ఇస్లాం, దుర్మారంగ మరియు దుర్మార్గులకు విరుధ్ధం. ఇస్లాం ఎల్లప్పుడూ సత్యం, ధర్మం మరియు శాంతి సందేశాన్నే బోధిస్తుంది. పైకి యజీద్ మరియు వాడి సైన్యం ముస్లిములే కాని వాళ్ళకు ఇస్లాం ఉపదేశలతో ఎటువంటి సంబంధం ఉండేది కాదు. ఈనాడు కొందరు ఇస్లాం పేరున పలు ఇస్లామీయ దేశాల పై ఏపాపము ఎరగని అమాయకులను చంపుతున్నారు, వీళ్ళూ ఆ యజీదియులతో సమానం. వీళ్ళు కూడా యజీద్ వలే కేవలం పేరుకు మాత్రం ముస్లిం జిహాదీలు. తమని తాము మంచి పూర్వీకుల అడుగుజాడలలో నడిచే వారము అని అంటారు, కాని నిజానికి వీళ్ళు ఏజాతికీ, సంబంధం లేనివారు. మతం పేరుతో జరుగుతున్న రాజకీయ మరియు బలాబలాల యుధ్ధం ఇది. ప్రపంచ ముస్లింలందరూ వాళ్ళను అసహ్యించుకుంటున్నారు.
యజీద్ న్యాయబద్ధమైన ఖలీఫాగా నిర్ధారించడానికై దైవప్రవక్త ముహమ్మద్(స.అ) యొక్క నిజమైన ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్(అ.స) నుంచి తన కోసం బైఅత్ తీసుకోవాలని ప్రయత్నించాడు కాని ఇమామ్ హుసైన్(అ.స) అన్యాయానికి విరుద్ధంగా మౌన పోరటం చేస్తూ తమ జన్మస్ధలమైన మదీనహ్ పట్టణాన్ని విడిచి ఏ దిక్కులేనివానిగా ఉండడానికైనా రాజీపడ్డారు గాని ఆ దుర్మార్గుడైన యజీద్ తో ప్రమాణాన్ని అంగీకరించలేదు. మదీనహ్ ను విడిచినపుడు ఇమామ్ హుసైన్(అ.స) “నేను (యజీద్ని వెతిరేకిస్తూ) గర్వంతో గాని లేదా దౌర్జన్యానికై గాని మదీనహ్ ను వీడవడం లేదు, నేను నా పితామహులైన దైవప్రవక్త ముహమ్మద్(స.అ) ఉమ్మత్ మేలు కోరకు బయలుదేరాను” అని అన్నారు.
యుద్ధానికి కూడా యజీదీయులు దాడి చేయనంత వరకు ఇమామ్ హుసైన్(అ.స) కత్తి చేతపట్టలేదు. చివరిక్షణాల వరకు “బ్రతుకూ ఇతరులను బ్రతక నివ్వు” అనే తమ సిధ్ధాంతాలను పాటిస్తూనే ఉన్నారు. కర్బలా రణరంగంలో ఇమామ్ హుసైన్(అ.స) తమ ఆత్మను బలిచ్చి మనకు ఆత్మగౌరవం, శాంతి ప్రియం మరియు చివరి శ్వాస వరకు సిధ్ధాంతాల పై ఓర్పు, సహనం మరియు ధైర్యంతో నిలబడాలని ఉపదేశించారు. అందుకే షియా ముస్లింలు వారి ఉపదేశాలు మరవకూడదని, అందరికి తెలియాలని ప్రతీ సంవత్సరం కర్బలాను స్మరిస్తూ ఉంటారు. వారి చరిత్ర మరియు ఉపదేశాలు కేవలం ముస్లింలకే కాకుండా నాగరికత, సంస్కృతి ఎదుగుదల కోరే ప్రతీ ఒక్కరికి ఉత్తమమైనవి.
ఇంతకు ముందు ఇమామ్ హుసైన్(అ.స)కు సంబంధించిన ఏదైనా విషయం ప్రపంచానికి చెప్పాలనుకుంటే వారు దైవప్రవక్త(స.అ) యొక్క మనవడు అని ముందుగా పరిచయించి ఆ తరువాత వారి గురించి చెప్పాల్సివచ్చేది కాని అల్ హందు లిల్లాహ్ ఈ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి ఇమామ్ హుసైన్(అ.స) ఎవరో తెలిసొచ్చింది అందుకు చాలా కారణాలున్నాయి; వాటి నుండి ముఖ్య కారణం ఇమామ్ హుసైన్(అ.స) గారి అర్బయీన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వారిని ఇష్టపడే వారు “నజఫ్” పట్టణం నుంచి “కర్బలా” పట్టణం వరకు పాదయాత్ర చేయడం. మరి ఆ పాదయాత్ర చేసే వారికి ప్రసాదించబడే పుణ్యం గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా వివరిస్తున్నారు: “కాలినడకతో ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ దర్శనానికి వెళ్ళేవారి ప్రతీ అడుగు పై వారి కోసం అల్లాహ్ ఒక పుణ్యం లిఖించి, ఒక పాపాన్ని తుడిచేస్తాడు, అతడి స్థానాన్ని పెంచుతాడు. జియారత్ చేయడానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ రెండు దూతలను అతడి కోసం, అతడి నోరు నుండి వచ్చే చెడును కాకుండా కేవలం మంచినే వ్రాయడానికి నియమిస్తాడు. మరి తిరిగి వచ్చే సమయంలో అతడిని సాగనంపుతూ ఇలా అంటారు: “ఓ అల్లాహ్ యొక్క వలీ! నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు ఇప్పుడు అల్లాహ్ సైన్యానికి చెందినవాడవు, ఆయన ప్రవక్త(స.అ) సైన్యానికి చెందినవాడవు, అతని అహ్లెబైత్(అ.స) సైన్యానికి చెందినవాడవు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాము! ఎట్టిపరిస్థితిలో నీవు కళ్ళతో అగ్ని(నరకం)ని చూడవు అలాగే అగ్ని కూడా నిన్ను చూడలేదు మరియు నిన్ను తన ఆహరంగా చేసుకోలేదు.[1].
ఈ హదీస్ మనకు చాలా విషయాలను చెబుతుంది. దానిని గ్రహించడానికి ప్రయత్నించండి.
రిఫ్రెన్స్
ఇబ్నె ఖూలవైహ్, కామిలుజ్జియారాత్, నాషిర్ అల్ మత్బఅతుల్ ముబారకతుల్ ముర్తజవియహ్, నజఫ్.
వ్యాఖ్యానించండి