తుఫాను నీళ్ళలో మునిగిన హజ్రత్ నూహ్[అ.స] కుమారుడు మరియు అల్లాహ్ తరపు నుండి వచ్చిన ఆదేశం.
అల్లాహ్ ఆదేశానుసారం నింగీ మరియు నేల నుండి నీళ్ళు పొంగి ఆ రెండు కలిసి తుఫాను ఏర్పడింది. నూహ్, వారిని విశ్వసించినవారు మరియు జంతువులు ఓడలోకి ఎక్కారు. ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్[అ.స] ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, “ఒరేయ్ నాయనా! మాతొపాటే వచ్చి కూర్చోరా. అవిశ్వాసులతో వెళ్ళకురా” అని బిగ్గరగా పిలిచారు. దానికి వాడు, “(నాన్నా!) నేను ఏదయినా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను. అది నన్ను ఈ నీళ్ళ నుంచి కాపాడుతుంది” జవాబిచ్చాడు. అల్లాహ్ ఉత్తర్వు నుండి ఈ రోజు కాపాడే వాడెవడూ లేడురా!, అల్లాహ్ తాను దయదలచిన వారిని మాత్రమే కాపాడతాడు” అని నూహ్ చెప్పారు. అంతలోనే వారిద్దరి మధ్యా ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే! వాడు కూడా ముంపుకు గురైనవారిలో చేరిపోయాడు.[హూద్:43].
హజ్రత్ నూహ్[అ.స] తన ప్రభువును పిలుస్తూ, “నాప్రభూ! నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా! నిశ్చయంగా నీ వాగ్దానం సత్యమైనది. నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు” అని విన్నవించుకున్నారు. దీనికి సమాధానంగా, “ఓ నూహ్! ముమ్మాటికీ వాడు నీ కుంటుబీకుడు కాడు. వాడి పనులు ఏమాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. (ఈ విధంగా అడిగి) నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను” అని అల్లాహ్ అన్నాడు. హజ్రత్ నూహ్[అ.స], “నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను” అని అభ్యర్థించారు.[హూద్:45-47].
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... Iltemase dual....
వ్యాఖ్యానించండి